అసలు ఐపీఎల్ 13 వ సీజన్ ఉంటుందా..? కరోనా విజృంభిస్తున్న వేళ ప్రేక్షకులు వస్తారా..? అన్ని ఈవెంట్స్ వాయిదా పడుతున్న సమయంలో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ సాధ్యమేనా..? ఇలా ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు తలెత్తిన సమయంలో.. సిరీస్ ను నిర్వహించి అందరి చేతా శేభాష్ అనిపించుకుంది.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. బీసీసీఐ. టీ 20 వరల్డ్ కప్ సిరీస్ వాయిదా పడ్డ తర్వాత.. యూఏఈలో ఐపీఎల్ ను నిర్వహించింది.. బీసీసీఐ. ప్రేక్షకులు లేకుండానే.. బంపర్ హిట్ కొట్టింది. ఏకంగా 4 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. ఐపీఎల్ వివరాలను వెల్లడించారు. ఇంతటి విజయానికి కారణం.. కార్యదర్శి జైషా ( అమిత్ షా కుమారుడు ) అని.. ఆయన ధైర్యం చేసి ముందడుగు వేయడం వల్లే టోర్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిందని తెలిపారు.
చెన్నై జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్ రావడం.. తమను ఆందోళనకు గురిచేసిందని ధుమాల్ గుర్తు చేశారు. ప్రత్యేక వైద్య బృంధాలతో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు తెలిపారు. టోర్నీ జరిగినన్ని రోజుల్లో అన్ని ఫ్రాంఛైజీల వారికి మొత్తం 30 వేల ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించారు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 న ప్రారంభం అయిన ఐపీఎల్ 13 వ సీజన్.. నవంబర్ 10 వ తేదీ వరకు మొత్తం 53 రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో లీగ్ను నిర్వహించారు. ఈ సిరీస్ ద్వారా 35 శాతానికిపైగా ఖర్చులు తగ్గించుకున్నట్లు వెల్లడించిన బీసీసీఐ.. టీవీ, డిజిటల్ మార్కెట్ ద్వారా 25 శాతం పెరిగిందని ప్రకటించింది.