జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు బయటకు రాలేదు.. ఇళ్లల్లోనే ఉన్నారు.. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఉన్నారు.. ఓటు వేయటానికి రాలేదు అంటూ తెగ గగ్గోలు పెట్టిన వారికి ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం. అసలు వాస్తవం ఏంటీ అంటే.. 2009, 2016 ఎన్నికల కంటే.. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఓటింగ్ శాతం పెరిగింది. మీడియా అత్యుత్సాహం వల్ల తప్పుగా రాశారు అందరూ.
బ్యాలెట్ ఓటింగ్ విధానం, రెగ్యులర్ గా పోలింగ్ కోసం ఉండే ఉపాధ్యాయులు కాకుండా ఇతర సిబ్బంది పని చేయటం వల్ల వాస్తవ లెక్కలు బయటకు రావటానికి ఆలస్యం అయ్యింది అంటోంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. అసలు సిసలు ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
149 డివిజన్లలో 46.68 శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొంది. అత్యధికంగా కంచన్ బాగ్లో 70.39 శాతం, అత్యల్పంగా యూసఫ్గూడలో 32.99 మేర పోలింగ్ శాతం నమోదైంది. 20 ఏళ్లలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక ఓటింగ్ అని, 2009 లో 42.04 శాతం, 2016 లో 45.29 శాతం ఓటింగ్ నమోదైనట్టు జీహెచ్ఎంసీ తెలిపింది.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తక్కువగా ఉండటానికి ఓ కారణం ఉంది. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. దీని వల్ల ఒక్కో పోలింగ్ కేంద్రానికి వెయ్యి నుంచి 15 వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీనికితోడు పోలింగ్ సమయం కూడా పెంచారు.
గతంలో 5 గంటల వరకు ఉంటే.. ఇప్పుడు 6 గంటల వరకు ఉంది. గంట సమయం పెరిగింది. ఇవన్నీ చూసుకోకుండా ఓటర్లు రాలేదు.. ఓటు వేయలేదు అంటూ మీడియా తప్పుడు కథనాలు, వార్తలు ప్రసారం చేసిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.