కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడిన విషయం విదితమే. ప్రస్తుతం ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులు విద్యార్థులకు కొంత ఇబ్బందిగానే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాఠశాలల పున ప్రారంభంపై చర్చ జరిగింది.. విద్యార్థులకు విద్య సంస్థల ప్రారంభంపై క్లారిటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంపై స్పందించిన విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠశాలలను మూసివేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. విద్యా సంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టనుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్లైన్ క్లాసులకు రూపకల్పన చేశామన్నారు. విద్యార్థులందరికీ ఉచితంగా బుక్స్ను పంపిణీ చేశామని తెలిపారు.